గత సంవత్సరం ఏం చేశామో.... ఈ సంవత్సరం అంతకన్నా శ్రమించాలి: ప్రధాని మోడీ

 


దేశం లో కరోనాను నియంత్రించేందుకు గత సంవత్సరం ప్రజలు ఎలా పోరాడారో, ఇప్పుడు అంతకన్నా మరింతగా సమన్వయంతో యుద్ధం చేయాల్సి వుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనాపై పరిస్థితిని శనివారం నాడు సమీక్షించిన ఆయన, వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడారు. తమ వద్ద కరోనా టీకాలు లేవని, ఈ కారణంగా వ్యాక్సినేషన్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని పలువురు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మోదీ, దేశంలోని అన్ని వనరులనూ వినియోగించుకుని వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు టీకాను తయారు చేస్తున్న కంపెనీలతో చర్చించాలని సూచించారు.

"ఇప్పుడు పెరుగుతున్న కొవిడ్-19 కేసులపైనా, దేశంలోని పరిస్థితులపైనా చర్చించాం. కరోనా రోగులకు ఔషధాలు, ఆక్సిజన్, వెంటిలేటర్లతో పాటు వ్యాక్సినేషన్ పైనా దృష్టి సారించాం. గత సంవత్సరం మనం ఎంతో పోరాడాం. ఆపై కరోనాను నిలువరించాం కూడా. ఈ సంవత్సరం మరింత బలంగా పోరాడాలి" అని ఈ సమావేశం అనంతరం నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఇండియాలో శనివారంతో 1.45 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒక్క శనివారం నాడే 2.34 లక్షల కేసులు వచ్చాయి. ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ఒకరోజు కేసుల రికార్డు. దేశంలో వరుసగా మూడవ రోజు 2 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలో 10 లక్షలకు పైగా కొత్త కేసులు రావడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పకనే చెబుతోంది.ఇక ఈ సమావేశంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్ కు మించిన కరోనా నియంత్రణ మార్గం మరొకటి లేదని అభిప్రాయపడిన నరేంద్ర మోదీ, రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. ఇండియాలోని ఆక్సిజన్ తయారీ ప్లాంట్లలో ఉత్పత్తిని మరింతగా పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.





0/Post a Comment/Comments

Previous Post Next Post