డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్

లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన డీఎస్పీ కుమారుడి (23)కి కరోనా పాజిటివ్ అని తేలడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేగింది. అతడితోపాటు కుటుంబ సభ్యులు మొత్తాన్ని వెంటనే గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్న యువకుడు ఈ నెల 18న హైదరాబాద్ వచ్చాడు. అనంతరం కారులో కొత్తగూడెం వెళ్లాడు. 20వ తేదీ వరకు అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఈ సందర్భంగా కొందరు బంధుమిత్రులను కూడా కలిశాడు. 20న దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అదే రోజు అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. నిన్న అతడికి సంబంధించిన రిపోర్టులు రాగా, కరోనా పాజిటివ్ అని వచ్చింది. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పోలీసు శాఖలోనూ ఆందోళన మొదలైంది. డీఎస్పీకి కూడా కరోనా సోకే ఉంటుందని భావిస్తున్నారు. ఆయన కుటుంబం, వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు, బాధిత యువకుడిని తీసుకెళ్లిన కారు డ్రైవర్ సొంతూరు వెళ్లినట్టు తెలియడంతో అక్కడి వారిలోనూ ఆందోళన మొదలైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post