ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్‌ వాజేను పోలీస్ ఫోర్స్ నుంచి డిస్మిస్

 


ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని నిలిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజేను పోలీసు సర్వీసు నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ఆదేశాలు జారీ చేశారు. 1990 మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 49 ఏళ్ల వాజేకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరుంది. వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్యకేసులోనూ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ నివాసమైన అంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన కేసులో వాజే ప్రమేయంపై ఎన్ఐఏ బలమైన సాక్ష్యాలు సంపాదించింది. వాజే ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు, వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసును కూడా ఎన్ఐఏనే దర్యాప్తు చేస్తోంది. అంటిలియా వద్ద నిలిపిన కారు మన్‌సుఖ్ హిరేన్‌దే. తన కారు చోరీకి గురైందని ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. కారు చోరీకి గురి కావడానికి ముందు సచిన్ వాజే దానిని కొన్ని నెలలపాటు ఉపయోగించినట్టు హిరేన్ భార్య ఆరోపించారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేశ్ గౌర్, వాజే సహచరుడు రియాజ్ కాజీలు కూడా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post