ఉగ్రదాడిలో చనిపోయిన తాత మృతదేహంపై చిన్నారి ....కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం



జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో ఓ జవాన్ సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారిని ఉగ్రవాదుల తూటాల బారినపడకుండా భద్రత దళాలు రక్షించాయి. ఉగ్రవాదుల దాడిలో ఈ బాలుడి తాత ప్రాణాలు కోల్పోగా.. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహంపై అభం శుభం తెలియని ఈ చిన్నారి కూర్చుని ఉన్న ఫోటో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. తీవ్ర భయాందోళనలతో ఉన్న చిన్నారిని సైన్యం అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించింది.శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలుడు తన తాతతో కలిసి శ్రీనగర్ నుంచి హంద్వారాకు కారులో వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో సోపోర్ వద్ద సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కారులో ఉన్న పెద్దాయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.గతవారం అనంత్‌నాగ్ వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడిన ఘటనలో ఓ ఆరేళ్ల బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సమయంలో నిహాన్ భట్ (6) నిలిచిన ఉన్న ఓ కారులో పడుకుని ఉన్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ సహా నిహాన్ బలయ్యాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయ్యింది.

Previous Post Next Post