ప్రగతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం


 

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుండగా, రాష్ట్రానికి రేపు టీకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల నిల్వ, వినియోగం తదితర వాటిపై చర్చించనున్నారు. అలాగే, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో తెరవడంపై సాధ్యాసాధ్యాల పరిశీలన, ధరణి వెబ్‌పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అంశాలతోపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపైనా సమావేశంలో చర్చించనున్నారు.

Post a Comment

Previous Post Next Post